అమ్మ మురిసే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 13: సద్దుల బతుకమ్మ వేడుకల సందర్బంగా కరీంనగర్ జిల్లా పూల వనమైంది. రంగురంగుల, తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మను కీర్తిస్తూ పాడిన ఆడపడుచుల ఆటపాటలతో గౌరమ్మ మురిసిపోగా, బతుకమ్మ ఆటపాటల్లో తేలియాడిన మహిళాలోకం పరవశించిపోయింది. అడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ సంబురాలు మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేత్రపర్వంగా..ఆకాశమే హద్దుగా సాగాయి. తెలంగాణ సంస్కృతిని, పల్లె జీవనశైలిని చాటిచెప్పే విధంగా వేలాది మంది చిన్నారులు, యువతులు, మహిళలు ఒక్కేసి పువ్వేసి చందమామ..ఒక్క జాము ఆయే చందమామ…ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.ఏమేమి కాయప్పునే గౌరమ్మ… అంటూ బతుకమ్మను కీర్తిస్తూ పాడిన ఆటపాటలు పల్లెలు, పట్టణాల్లో మారుమ్రోగాయి. ఉదయాన్నే లేచిన మహిళలు తలంటూ స్నానాలాచరించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిజిబిజిగా ఉంటూ బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ మధ్యన గౌరమ్మ తల్లిని ఉంచారు. సాయంత్రం ఇంటి వాకిళ్లల్లో కొద్దిసేపు బతుకమ్మను పెట్టి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మ ఆడే మైదానాలకు బతుకమ్మలతో మహిళలు చేరుకుని గ్రూపులుగా గ్రూపులుగా రాత్రి వరకు ఆట ఆడగా , సద్దుల బతుకమ్మ వేడుక ఉత్సవంలా కొనసాగింది. ఆటపాట ముగిసిన తరువాత బతుకమ్మలను గ్రామ చెరువులు, కుంటల్లో వదులుతూ గౌరమ్మ తల్లీకి వెళ్లి రావమ్మా.. మళ్లీ రావమ్మా అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం మహిళలు సత్తు పిండి వాయినాలు ఒకరికొకరు అందజేసుకున్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ తోపాటు పలు మండలాలు, గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టింది. మొత్తం మీద సద్దుల బతుకమ్మ వేడుక నేత్రపర్వంగా కొనసాగగా, తమను చల్లగా చూడాలంటూ గౌరమ్మ తల్లీకి మహిళలు ఘనంగా వీడ్కోలు పలికారు.