ఆ ధ్యాస ఆనాడేది…?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 29: తెలుగు రాష్ట్రాలూ పచ్చగా ఉండాలన్న ధ్యాస ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎందుకు లేకుండా పోయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. శనివారం ఆయన ముఖ్యమంత్రుల సమావేశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పోలవరంపై కేసుల అంశాన్ని ఏం చేశారో చెప్పాలన్నారు. గతంలో జల వివాదాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా భద్రాచలం మునిగిపోతుందని గతంలో పేర్కొన్న కేసీఆర్, ఇప్పుడు ఎలాంటి ముప్పూ లేదన్న నిర్ణయానికి వచ్చారా ? అని నిలదీశారు. నాడు తెలంగాణ ప్రజలను పదవీ కాంక్షతోనే కేసీఆర్ తప్పుదోవ పట్టించారని లక్ష్మణ్ విమర్శించారు. ఎలాంటి నిర్ణయమైనా థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా తీసుకుంటామని టీఆర్ఎస్ చెప్పిందని, మరి పోలవరంపై కవిత వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుందా? అని ప్రశ్నించారు.