చివరి రక్తపు బొట్టు దాకా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 27: ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా.. ఆ విధంగానే దళిత బంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతా… “నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా”నంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని పేర్కొన్నారు. ఎన్కటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు అమలు తీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని కేసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహేష్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు, రాష్ట్ర స్థాయి దళిత బంధు రిసోర్స్ పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.