సరిహద్దులు మూసివేత…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఢిల్లీ, మార్చి 15: కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్, ఇండో-మయన్మార్ సరిహద్దుల వెంబడి అన్ని రకాల ప్రయాణికులపై నిషేదాజ్ఞలు విధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుండగా, అదేవిధంగా ఇండో-పాక్ సరిహద్దు మూసివేత రేపటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల ప్రవేశాల మార్గాల వద్ద కరోనా వైరస్ నిర్ధారణ ఆరోగ్య పరీక్షలను ముమ్మరం చేశారు. కాగా, అధికారిక వీసాలు కలిగిన రాయబారులు, యూఎన్ సిబ్బందిని మాత్రం భారత్-పాక్ సరిద్దులోని అట్టారి క్రాసింగ్ పాయింట్ వద్ద అనుమతిస్తారు. అదైనా వీరిని పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతించనున్నారు. వీరిలో ఎవరైనా అనుమానితులుగా తేలితే క్వారంటైన్కు పంపిస్తారు. ఇండియా-బంగ్లాదేశ్ల మధ్య రైళ్లు, బస్సు సర్వీసులను ఏప్రిల్ 15 వరకు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.