కరోనా కాటేసింది…తొలి మరణం నమోదు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ లో తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్ లోని నాంపల్లికి చెందిన (74) వృద్ధుడు ఇవాళ మృతి చెందాడు. కరోనా కట్టడికి కేసీఆర్ సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, కరోనా కేసులు పెరుగుతుండం, అందులో తొలి కరోనా మరణం నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందని, ఢిల్లీకీ వెళ్లొచ్చిన పలువురు కరోనా బారినపడ్డారని మంత్రి తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలిందని స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తి నాంపల్లికి చెందిన వాడని, ఆయన వయస్సు 74 సంవత్సరాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చినవాళ్లు ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వం వారిలో భరోసా కల్పించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తామని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి భోజన కేంద్రాలు, వసతి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. నిన్న ఒకేసారి 9 పాజిటివ్ కేసులు రావడంతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పారని ఈటల వెల్లడించారు. అప్పటినుంచి సీఎం మూడు పూటలా సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇవాళ 6 కేసులు వచ్చాయని, వీరందరూ ప్రయాణాలు చేసినవారేనని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 65 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఓ మరణం కూడా ఉందని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.