ముగిసిన చిన్నమ్మ అంతిమ సంస్కారాలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 7: తెలంగాణ చిన్నమ్మ, బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్కు కన్నీటి వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు, సుష్మా స్వరాజ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించిన అనంతరం, బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి శ్మశాన వాటిక వరకు ఆమె అంతిమయాత్ర నిర్వహించారు. సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, బీజేపీ అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సుష్మా హఠాన్మరణంతో భాజపా అగ్రనేతలు భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని, మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు.