వినోద్ కుమార్ కు కీలక పదవి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సంతకం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్ ను ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా సిఎం నియమించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేసే కీలక పనిని కూడా వినోద్ కుమార్ కు సిఎం అప్పగించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి ఉండడంతోపాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. వినోద్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్లు సిఎం చెప్పారు. కాగా, వినోద్ నియామకం పట్ల టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, సంబరాలు జరుపుకున్నారు.