ఫైనల్లోకి ఇంగ్లాండ్…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 11: ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరింది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఆసీస్ తనముందుంచిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ టీమ్ కేవలం 32.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (85), జానీ బెయిర్ స్టో (34) పటిష్టమైన పునాది వేయగా, కెప్టెన్ మోర్గాన్ (45), జో రూట్ (49) మిగతా పని పూర్తిచేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీయగా, కమ్మిన్స్ మరో వికెట్ దక్కించుకున్నాడు. గత వరల్డ్ కప్ విజేతగా, డిఫెండింగ్ చాంపియన్ గా తాజా వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా కథ సెమీస్ తోనే ముగిసింది. ఇక జూలై 14న విఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగే అంతిమ సమరంలో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్ జట్టు ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో భారత్ ను ఓడించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ గతేడాది కూడా ఫైనల్ చేరింది. ఇరుజట్లలో ఎవరు కప్ గెలిచినా అది చరిత్ర అవుతుంది. ఎందుకంటే, ఇంగ్లాండ్ క్రికెట్ కు పుట్టినిల్లు అయినా ఇంతవరకు 50 ఓవర్ల ఫార్మాట్ లో ప్రపంచకప్ గెలిచింది లేదు. మరోవైపు, న్యూజిలాండ్ ఇప్పటికి ఎనిమిదిసార్లు సెమీస్ ఆడి, రెండు పర్యాయాలు ఫైనల్ చేరింది. ఈసారి కప్ గెలిచి వరల్డ్ కప్ విన్నర్స్ క్లబ్ లో చేరాలని ఉత్సాహపడుతోంది. చూద్దాం మరీ ఏం జరుగుతుందో.