కరీంనగర్ సీపీకి జైలు శిక్ష..అప్పీలుకు ఛాన్స్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 27: కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు పోలీసు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) కమలాసన్ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కమలాసన్ రెడ్డి సహా అప్పటి కరీంనగర్ రూరల్ ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ ఎస్ హెచ్ వో శశిధర్ రెడ్డికి శిక్ష విధించింది. ఈ ముగ్గురు అధికారులకు 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అయితే, అప్పీల్ కు వెళ్లేందుకు నాలుగు వారాలపాటు తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గతంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తన పుష్పాంజలి రిసార్ట్స్ లోకి పోలీసులు ప్రవేశించి, తన రిసార్ట్స్ లో రమ్మీ ఆడుతున్నారంటూ వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఆరోపిస్తూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేపథ్యంలో పోలీసులకు హైకోర్టు గతంలో పలు సూచనలు చేసింది.