ఏమి జరిగిందో ఏమో…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
నిజామాబాద్, జూలై 2: రెండేళ్ల కూతురితో పాటు తనకు నిప్పంటించుకుని ఓ తల్లి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, 60 శాతం కాలిన గాయాలతో తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వేల్పూర్ మండలం పడగల్కు చెందిన మౌనికకు మూడేళ్ల కిందట నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో వివాహం జరిగింది. అయితే మౌనిక ఉన్నట్టుండి మంగళవారం కూతురితో పాటు నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు మౌనికను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మాత్రం మృతిచెందిందని, మౌనిక పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.