నల్గొండ జిల్లా లో దారుణం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
నల్గొండ, జూలై 20: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణ హత్యకు గురైన ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఇర్ఫాన్, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండీ గౌస్కు సోదరి వరుసైన ఓ మహిళ ఉండేది. ఆ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ తర్వాత నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన సద్దాం అనే ఆటో డ్రైవర్ ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాడు. కొంతకాలం ఇద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే మహిళ 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో తమకు సోదరి వరుసైన మహిళను సద్దాం హత్య చేశాడనే నెపంతో అతనిపై ఇర్ఫాన్, గౌస్లు కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి బొండాల కత్తితో ఇర్ఫాన్, గౌస్ ఇద్దరూ సద్దాం తల నరికారు. ఆ తలతో పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు లో ఉంది.