వానలొస్తున్నాయి….
1 min read
తొలకరి కోసం నిరీక్షిస్తున్న రైతాంగానికి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతు పవనాల కారణంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు గురువారం ఆంధ్రప్రదేశ్ ను, శుక్రవారం తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాకు ఆవల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టానికి 3.6 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నిలిచిందని, దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.