ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పై కేసు నమోదు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 25: సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఓ డ్రైవర్ ఏకంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. కార్మికులు సమ్మె బాట పట్టిన తర్వాత కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరి మృతికి జేఏసీ కన్వీనర్ గా ఉన్న అశ్వత్థామరెడ్డి కారణమంటూ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో డ్రైవర్ కోరేటి రాజు ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమవుతుందంటూ అశ్వత్థామరెడ్డి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యూనియన్ నాయకులే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారు మంచివారేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారడంతో పాటు చర్చనీయాంశమైంది.