ఇక అందరూ ఇంట్లోనే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మార్చి 22: కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటిస్తూ, ఈ తరుణంలో ఎవరింటికి వారు పరిమితం కావాలని కోరారు. ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అత్యావసర వస్తువుల కోసం కుటుంబానికి ఒక్కరిని మాత్రమే బయటికి అనుమతిస్తారని వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్టుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని హితవు పలికారు. రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్ని రోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డుదారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు. అత్యవసర సేవలు, అవసరాలు మినహా అన్ని షాపులు, బార్లు, పబ్లు, మద్యం షాపులు సైతం మూసివేయాలని సూచించారు. రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.