ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 26: ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించి పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోలకు చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. కార్మికులను విధుల్లోకి తీసుకోబోమంటూ ఇప్పటికే తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను డిపోల వద్ద అధికారులు అడ్డుకుంటున్నారు. విధుల్లోకి తీసుకోవాలని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మరోవైపు, విధుల కోసం వస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటుండడంతో డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధులకు ఆటంకం కలిగిస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని బస్ డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. తాత్కాలిక కార్మికులను అడ్డుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మొత్తానికి ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది.