ఇది ఎప్పుడైనా విన్నారా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
విశాఖ, జూన్ 24: సామాన్యంగా లంచం రూపంలో నగదును తీసుకుంటారు. కానీ ఇక్కడ డబ్బులకు బదులు భూమి కావాలని కొత్త తరహా అవినీతికి తెరలేపాడు ఓ అవినీతి అధికారి. ఈ ఘటన విశాఖ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కొత్త తరహా అవినీతికి తెరలేపి..చివరకు ఏసీబీ అధికారులకు చిక్కాడు ఆ భారీ అవినీతి తిమింగలం. లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్ చేసిన సహకార శాఖ రిజిస్ట్రార్ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సహకార శాఖ రిజిస్ట్రార్ మల్లిఖార్జున రావు తన దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.2కోట్లు లంచం డిమాండ్ చేశాడు. అయితే, అదీ నగదు రూపంలో కాకుండా భూమి రిజిస్ట్రేషన్ కి ఒప్పందం చేసుకున్నారు. బాధితుడి సమాచారంతో ఏసీబీ అధికారులు విశాఖ టర్నర్ ఛౌల్ట్రీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సదరు అధికారి నగదుకు బదులు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.