ఇక ఠాణాల్లో…థర్మల్ తనిఖీలు….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 7: ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల దుకాణాలలో ప్రజలను అనుమతించే ముందు కరోనా కట్టడీకి తగిన ముందు జాగ్రత్తలతో ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, పోలీసు స్టేషన్ లకు వచ్చే సాధారణ ప్రజలకు భరోసా కల్పించి వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు కరీంనగర్ పోలీసులు కరోనా కట్టడికి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరీనంగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఇక నుంచి థర్మల్ స్క్రీనింగ్, ఆక్సీ మీటర్లతో పల్స్ రేటింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా పోలీసు సిబ్బందికి మాత్రమే చేపట్టిన ఈ ప్రక్రియ ఇక నుండి ఠాణాలకు వచ్చే ప్రజలకు కూడా చేపట్టేంందుకు సిద్ధమయ్యారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో పాటు, స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరిని పరీక్షించిన తరువాత మాస్క్ ఉంటేనే లోపలకు అనుమతించనున్నారు. ఈ పరీక్షల్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న అనుమానం కలిగితే వెంటనే వారిని కరీంనగర్ లోని సివిల్ ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ మేరకు సీపీ కమలాసన్ రెడ్డి పోలీసు స్టేషన్ లోకి వచ్చే వారు ఎవరైనా సరే ఈ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, వారిని పరీక్షించిన తరువాతే అనుమతించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. దీనివల్ల కరోనా లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని, ఇటు పోలీసులు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అప్రమత్తం చేసినట్టవుతుందని, అటు స్టేషన్ కు వచ్చే సాధారణ ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నామన్న భరోసా కల్పించినట్టవుతుందని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.