ఆ పార్టీలో మళ్ళీ ఆయనపై చర్చ…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 12: తాజాగా చోటుచేసుకున్న పరిణామాల దరిమిలా అధికార తెరాసలో మళ్ళీ డీఎస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిన్న కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి మంతనాలు జరిపి మరోమారు వార్తల్లోకి ఎక్కారు. అమిత్ షాను డీఎస్ కలిసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు, దీంతో డీఎస్ వ్యవహారాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్.. నిన్న అమిత్ షాను కలవడం వెనక ఏదైనా వ్యూహం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారమే డీఎస్ ఇలా చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా నేతలు పార్టీ అధిష్ఠానాన్ని కోరగా, అమిత్ షాను డీఎస్ ఓ ఎంపీ హోదాలో కలిశారని, అంతేతప్ప రాజకీయంగా ఈ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని డీఎస్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తానికి మరోమారు డీఎస్ వార్తల్లో కి ఎక్కగా, తెరాస లో మాత్రం చర్చనీయాంశంగా మారింది.